నేడు తాడేపల్లికి వైయ‌స్‌ జగన్‌

 తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తాడేపల్లికి రానున్నారు. గత సోమవారం బెంగుళూరు వెళ్లిన వైయ‌స్‌ జగన్.. వినుకొండ ఘటన నేపథ్యంలో తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకోనున్నారు. 
కాగా, టీడీపీ దాడులపై వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయ‌స్ఆర్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారంటూ వైయ‌స్‌ జగన్‌ నిప్పులు చెరిగారు.

‘‘కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు.  ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు’’ అని వైయ‌స్‌ జగన్‌  ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top