గుంటూరు: పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడంలో అందరికన్నా పెద్దవారని, నిజాలు చెప్పడంలో అందరికన్నా చిన్నవాడంటూ ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి గుంటూరు నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంబటి.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి పోలవరం వెళ్ళారని,. చంద్రబాబు అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తుందని ఆయన అనుకూల పత్రికలు రాసిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు. 2018లోనే పూర్తి చేస్తామన్నారు: పోలవరం ప్రాజెక్టు సందర్శించిన సీఎం చంద్రబాబుగారు గత పది నెలలుగా ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. నిజానికి ఆనాడు 2018లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి 2019 ఎన్నికలకు వెళ్తామని అప్పటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ అసెంబ్లీలో ప్రకటించారు. ఆ పని చేయలేకపోయారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాక, 2027లో పోలవం పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా జగన్ మీద దుష్ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం, చివరకు పోలవరం పనుల్లో కూడా అదే ధోరణితో వ్యవహరిస్తోంది. 2019లో కూడా తాము అధికారంలోకి వచ్చి ఉంటే, 2020–21కే ప్రాజెక్టు పూర్తి చేసే వాళ్లమని సంబంధం లేకుండా చంద్రబాబుగారు మాట్లాడుతున్నారు. అది నిరూపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తా: వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిధులు మళ్లించారని చంద్రబాబు పచ్చి అసత్యాలు మాట్లాడుతున్నారు. పోలవరం నిధులను జగన్ డైవర్ట్ చేశారంటున్న చంద్రబాబు, దాన్ని నిరూపిస్తే నేను ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తా. నిజానికి ఆంధ్ర ప్రజల చిరకాల స్వప్నం, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాశనం చేసిందే కాకుండా, తప్పుడు ప్రకటనలతో మాపై బురద జల్లుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు, ఏనాడూ పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచించలేదు. 2004లో మహానేత వైయస్సార్ సీఎం అయ్యాకే, ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించి, పనులకు భూమి పూజ చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడిన చంద్రబాబు: పోలవరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసినా, కమిషన్లకు కక్కుర్తి పడిన చంద్రబాబు, ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత తీసుకున్నారు. అది కూడా 2013–14 ధరలతో ప్రాజెక్టు పనులు చేస్తామని 2016లో ఒప్పందం చేసుకున్నారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆ నిధులను కేంద్రం రీయింబర్స్ చేసేలా ఆ ఒప్పందం జరిగింది. అలాంటప్పుడు కేంద్రం నిధులను జగన్గారు డైవర్ట్ చేశారని చంద్రబాబుగారు విమర్శించడం అత్యంత హేయం. ప్రాజెక్టు పనులు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించాకే కేంద్రం ఆ నిధులు రీయింబర్స్ చేస్తుందన్న విషయం సీఎం చంద్రబాబుకు తెలియదా?. అస్మదీయులకే కాంట్రాక్ట్లు: పోలవరం ప్రాజెక్టు పనులను తన అనుయాయుల కంపెనీలకు కట్టబెట్టిన చంద్రబాబు, వారు (ట్రాన్స్ట్రాయ్ కంపెనీ) అడిగిందే తడువుగా అగ్రిమెంట్ విలువను రూ.4,054 కోట్ల నుంచి రూ.5,386 కోట్లకు పెంచుతూ ఉ్కఇ నిబంధనలకు విరుద్ధంగా రూ.1,332 కోట్ల అనుచిత లబ్ధి చేకూరుస్తూ, 2016 సెప్టెంబరు 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత పనులు క్యాన్సిల్ చేసి నామినేషన్ పద్ధతిలో నవయుగ కంపెనీకి పెంచిన రేట్ల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.3,000 కోట్ల పని అప్పగించారు. ఈ రెండు కంపెనీలు చంద్రబాబు అస్మదీయులవే కావడం గమనార్హం. అనాలోచిన నిర్ణయం. భారీ మూల్యం: నవయుగ కంపెనీ వారు అధికంగా లాభం ఉండే కాంక్రీట్ పనులే పూర్తి చేశారు. కానీ క్రిటికల్ కాంపొనెంట్లు అయిన రెండు కాఫర్ డ్యామ్ పనులు మాత్రం నత్తనడకన చేశారు. కాఫర్ డ్యాం మధ్యలో వదిలేసి డయాఫ్రం వాల్ పూర్తి చేశారు. ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా వరద ప్రవాహానికి డయాఫ్రం వాల్ కొట్టుకుని పోయింది. సాంకేతికంగా తప్పు చేసి, జగన్ కాంట్రాక్టర్ను మార్చడం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని ఆరోపిస్తూ, రాజకీయం చేస్తున్నారు. కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం చేయడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కానీ, చంద్రబాబు నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో జరిగింది. కమీషన్ల కోసం కక్కుర్తి పడి చంద్రబాబు చేసిన ఈ తప్పు కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. జగన్ చొరవతోనే రూ.12,557 కోట్లు విడుదల: జగన్గారు సీఎం అయ్యాక అనేకసార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం నిర్మాణానికి కేంద్రమే అడ్వాన్సుగా నిధులు చెల్లించేలా ఒప్పించడంతోపాటు 2016–17 రేట్లకు అనుగుణంగా సవరించిన అంచనాలకు కేంద్రాన్ని ఒప్పించారు. గతంలో 2013–14 ధరలు చెల్లించేలా చంద్రబాబు చేసుకున్న అనాలోచిత ఒప్పందాన్ని ఆయన కేంద్రంతో పోరాడి సవరింప చేశారు. ఆ మేరకు పోలవరం మొదటి దశకు కావాల్సిన రూ.12,557 కోట్లు చెల్లించేలా కేంద్రంతో మాట్లాడారు. అయితే ఈలోపు ఎన్నికలు రావడం, బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారు కావడంతో నిధులు విడుదల చేయకుండా చంద్రబాబు అడ్డుపడ్డారు. ఆరోజు జగన్ మాట్లాడి ఒప్పించిన నిధులనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం విడుదల చేసింది. అడ్వాన్సు రిలీజ్ కావడానికి జగనే కారణం. నిధుల డైవర్ట్ చేసింది చంద్రబాబే: కేంద్రం పోలవరం కోసం విడుదల చేసిన ఆ నిధులను చంద్రబాబు ప్రభుత్వం వివిధ కార్యకలాపాల కోసం మళ్లించింది. దీనిపై దాదాపు 15సార్లు కేంద్రం సీరియస్ అవడంతో జాయింట్ అకౌంట్లో వేసిన దుస్థితికి పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చాడు చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వం పోలవరం అడ్వాన్సు కోసం ఇచ్చిన రూ.12,557 కోట్లు డైవర్ట్ చేసిన చంద్రబాబు, సిగ్గు లేకుండా గత మా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. క్లిష్టమైన పనులన్నీ మేం పూర్తి చేశాం: పోలవరం ప్రాజెక్టు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు. దివంగత వైయస్సార్ కలలు గన్న ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి, దాన్ని కాపాడుకునేందుకు వైయస్సార్సీపీ అనుక్షణం తాపత్రయ పడింది. డయాఫ్రం వాల్ సమస్యపై కెనడా, అమెరికా నుంచి నిపుణులను పిలిపించి నష్ట నివారణకు చర్యలు చేపట్టాం. కాఫర్ డ్యామ్ నిర్మాణంలో జరిగిన లోపాల కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బ తిన్నదని విదేశీ నిపుణులు స్పష్టంగా చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. చంద్రబాబు చేసిన తప్పులను సరి చేయడానికే గత ఐదేళ్ల సమయం సరిపోయింది. స్పిల్వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్.. ఇలా పనులన్నీ దశల వారీగా మా ప్రభుత్వ హయాంలోనే చేశాం. 2021లో నదిని డైవర్ట్ చేసిన ఘనత కూడా వైయస్సార్సీపీ ప్రభుత్వానిదే అని గర్వంగా చెబుతున్నాం. టీడీపీ ప్రభుత్వం వదిలేసిన ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు కూడా పూర్తి చేశాం. నిపుణుల సూచనల మేరకు రెండో డయాఫ్రం వాల్ నిర్మాణం చేయాల్సి ఉంటే, ఆ పనులే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తోంది. చంద్రబాబు దారుణ మోసం: ఇప్పటికీ పోలవరం పూర్తి చేసే అవకాశం చంద్రబాబుకి వచ్చినా ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు అంగీకరించి మరోసారి ప్రజలను దారుణంగా మోసగించాడు. దీనిపై ప్రజలను మభ్యపెడుతున్నాడు. పోలవరం ప్రాజెక్టు రెండో దశ పనులు పూర్తి కావాలంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి మరో రూ.30 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఎగ్గొట్టేందుకు పోలవరం ఎత్తు తగ్గించాలని కేంద్రం ప్రతిపాదిస్తే, నిస్సిగ్గుగా చంద్రబాబు దాన్ని అంగీకరించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే..: నాకున్న అవగాహన ప్రకారం పెండింగ్ పనులు పూర్తి చేసి 2027కి ముందే పోలవరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావొచ్చు. ఎందుకంటే, ప్రాజెక్టుకు సంబంధించి క్లిష్టమైన సమయాభావం తీసుకునే పనులన్నీ వైయస్సార్సీపీ హయాంలోనే పూర్తి చేయడం జరిగింది. కానీ, చంద్రబాబు పదే పదే పోలవరం పర్యటనలు పెట్టుకుంటే 2027కి పూర్తవడం కూడా అనుమానమే అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. నిర్బంధాలు, అక్రమ కేసులను ఎదిరించడంతోనే వైయస్సార్సీపీ పురుడు పోసుకుందనే విషయం గుర్తుంచుకోవాలి. అరెస్టులతో జగన్ శక్తిని అడ్డుకోలేరు. వికృత చేష్టలకు పాల్పడుతున్న పోలీసులకు, ఎర్ర బుక్కు రాస్తున్న లోకేష్కు రాబోయే రోజులు ఎంత దారుణంగా ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా. మా పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లి లిక్కర్ స్కాం జరిగిందని చెప్పిన లావు శ్రీకృష్ణదేవరాయలు రేపు మళ్లీ మా పార్టీలోకొస్తే టీడీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని చెబుతాడేమో! అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.