విజయవాడ: ఎన్నికల్లోపే చంద్రబాబు పతనమైపోవడం ఖాయమని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉంటాయని, దీన్ని ఆపడం చంద్రబాబు తరం కాదని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. దుర్మార్గమైన చంద్రబాబు పాలన వద్దని ప్రజలతో పాటు, టీడీపీ నేతలు కూడా ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించే సత్తా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని అంతా విశ్వసిస్తున్నారన్నారు. వైయస్ఆర్ సీపీలోకి వచ్చే వలసలు చూసి చంద్రబాబు బిత్తరపోయి మాట్లాడుతున్నారన్నారు. విజయవాడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరాచక, అవినీతి పాలనలో విసిగిపోయి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుగా ఉన్న నాయకులు కూడా నిన్ను నమ్మం బాబూ అంటూ ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారన్నారు. మాట తప్పని, మడమ తిప్పని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్ జగన్ ఈ రాష్ట్రానికి శరణ్యమని వైయస్ఆర్ సీపీలో చేరుతున్నారన్నారు. వలసలు చూసి చంద్రబాబు చలి జ్వరం పట్టుకుందన్నారు. దీంతో సొంత పార్టీ నాయకులపై నిఘా ఏర్పాటు చేసుకొని దౌర్భాగ్యస్థితికి దిగజారాడన్నారు. చంద్రబాబు మరో పదిహేను రోజుల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఇంకో రెండు నెలల్లో మాజీగా మిగిలిపోవడం ఖాయమన్నారు. కేసీఆర్ భయపెట్టారు. మోదీ భయపెట్టారు.. అందుకే వైయస్ఆర్ సీపీలో చేరుతున్నారని చంద్రబాబు, లోకేష్ చౌకబారు మాటలు మాట్లాడుతుంటే జాలేస్తుందన్నారు. ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, ఆయన కొడుకు మాత్రమే మిగిలిపోతారన్నారు. ప్రజల దీవెనలతోనే వైయస్ జగన్ పూర్తి స్థాయి మెజార్టీతో విజయం సాధిస్తారని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సంతలో పశువుల్లా వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేశారన్నారు. కానీ అధికార పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో చేరడం చూసి చంద్రబాబు వెన్నులో వణుకుపుడుతుందన్నారు. చంద్రబాబు నువ్వు చేతగాని వాడని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని వాడని, రాజధాని ఒక్క పర్సంట్ కట్టలేని వాడని, విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టలేనివాడని అంటుంటే సిగ్గుగా లేదా.. అని ప్రశ్నించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రభంజనాన్ని ఆపడం చంద్రబాబు జేజమ్మ వల్ల కూడా కాదన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ సీపీలోకి ఎంతో మంది క్యూ కడుతున్నారన్నారు.