అమరావతి: ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమని మంత్రి విడదల రజిని తెలిపారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి విడదల రజిని సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ఏ వైద్య సేవల అయినా పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఏపీలోనే సగౌరవంగా, సకల సదుపాయాలతో అందరూ పొందాలన్నదే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. విభజన అనంతరం ఏపీలో సూపర్ స్పెషాలిటీ సేవలు అవసరమయ్యాయి. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి చౌకగా, అత్యాధునిక పరికరాలతో వైద్యసేవలు, మెరుగైన సౌకర్యాలతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. 16 మెడికల్ కాలేజీలను ఇప్పటికే చేపట్టాం. పార్వతీపురంలో మరో కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. కోవిడ్ కారణంగా ఎదురైన అనేక సవాళ్లను ఎదురించి అత్యధికంగా, అత్యంత వేగంగా కాలేజీల పనులు చేపడుతున్నాం. ప్రభుత్వం పటిష్టాత్మకంగా చేపడుతున్న కొత్త మెడికల్ కాలేజీలతో పాటు వైద్యాన్ని మరింత చేరువ చేయాలన్నదే సీఎం వైయస్ జగన్ ఉద్దేశం. నాడు–నేడు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాం. గతంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కొత్తగా 17 కాలేజీలు నిర్మిస్తున్నాం. గత ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ నిర్మించలేదు. గత ఐదేళ్లు దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పని చేసింది. ప్రజలంతా ఆనందంగా సంతోషంగా ఉండాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కేంద్రంతో టీడీపీ పొత్తుగా ఉంది. అప్పట్లో బీజేపీకి చెందిన రాష్ట్రమంత్రి ఉండేవారు. అయినా కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారు. రానున్న కాలంలో ఐదు మెడికల్ కాలేజీలకు వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు కూడా చేపడుతున్నాం. ఈ డిసెంబర్ నాటికి ఈ ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేస్తాం. 300 పడకల ఆసుపత్రులకు రూ.500 కోట్లు నిధులు మంజూరు చేశాం. ఇవే నిధులతో వసతులు కూడా పెంచుతున్నామని మంత్రి విడదల రజిని తెలిపారు. ఐదు కాలేజీల్లో ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు ఉంటాయని చెప్పారు. కర్నూలు క్యాన్సర్ ఆసుపత్రిని వచ్చేఏడాది మార్చి నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్ కాలేజీల ద్వారా 4300 సీట్లు రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయని మంత్రి విడదల రజిని వివరించారు.