గుంటూరు: తన అనుకూల మీడియానే లేకపోతే రాజకీయాల్లో చంద్రబాబు అనే వ్యక్తే ఉండేవాడు కాదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి రజిని మాట్లాడుతూ పేద ప్రజలకు మేలు జరుగుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులు, పచ్చ మీడియా ఓర్చుకోలేకపోతున్నాయని అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగనన్న చిరస్థాయిగా వారి హృదయాల్లో నిలిచిపోతారనే అక్కసుతోనే విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం ఖర్చు చేసింది 11వేల కోట్ల రూపాయలే అయితే... ఏకంగా రూ.15వేల కోట్ల అవినీతి ఎక్కడి నుంచి జరుగుతుందో పవన్కళ్యాణ్ చెప్పాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ ప్రభుత్వంలో కేవలం 1,059 మాత్రమే ఉన్న ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను సీఎం జగన్ ఏకంగా 3,255కు పెంచారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, అనుబంధ ఆస్పత్రులను అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్ రూ.3,820 కోట్లను ఖర్చు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లను తమ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుందని వివరించారు. ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే మూడేళ్ల వ్యవధిలో 45వేల నియామకాలు చేపట్టిన ఒకే ఒక్క సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అని మంత్రి కొనియాడారు. గురుకుల పాఠశాల తనిఖీ చిలకలూరిపేట రూరల్ మండలం రాజాపేట లోని గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయలపై, అలానే విద్యార్థులకు పెడుతున్న భోజన సదుపాయలపై అడిగి వివరాలు తెలుసుకున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజిని.