కర్నూలు: వక్ఫ్ చట్టం ఉపసంహరించేంత వరకు పోరాటం ఆగదని కర్నూలు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మైనారిటీల హక్కుల కాలరాస్తూ రూపొందించిన వక్ఫ్ చట్టంపై వ్యతిరేకంగా సోమవారం కర్నూలు నగరంలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను నియంత్రణలోకి తీసుకురావడానికి ఒక చట్టం చేశారని ఇది చాలా అభ్యంతరకరమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్లమెంటులో బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి మైనార్టీలకు తీవ్ర ద్రోహం చేశారని ఆక్షేపించారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ మైనార్టీ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.