తాడేపల్లి: దారుణ హత్యకు లింగమయ్య కుటుంబానికి ఏం జరిగినా చూస్తూ ఊరుకోమని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఏ మాత్రం భయపడొద్దు.. ధైర్యంగా ఉండాలని వైయస్ జగన్ లింగమయ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో టీడీపీ నేతల చేతిలో దారుణహత్యకు గురైన వైయస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. లింగమయ్య భార్యతో పాటు, ఆయన ఇద్దరు కుమారులు శ్రీనివాసులు, మురళితో వైయస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. లింగమయ్య హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ఉగాది పండగ రోజు గుడికి వెళ్లి వస్తుండగా, దారి కాచిన టీడీపీ గుండాలు దాదాపు 20 మంది తమ తండ్రిని దారుణంగా హతమార్చారని వారు తెలిపారు. పార్టీ తప్పకుండా అండగా ఉంటుందని, అన్ని విధాల ఆదుకుంటుందని ఫోన్లో పరామర్శ సందర్భంగా వైయస్ జగన్, లింగమయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఏ మాత్రం అధైర్యపడొద్దని, వచ్చే వారం స్వయంగా తాను వస్తానని వైయస్ జగన్ చెప్పారు. కాగా, గ్రామంలో తమకు రక్షణ లేదని, స్థానిక ఎస్ఐ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ, తమను భయాందోళనకు గురి చేస్తున్నారని లింగమయ్య కొడుకు ప్రస్తావించారు. స్పందించిన వైయస్ జగన్, పార్టీ జిల్లా నేతలు, లీగల్సెల్ను అప్రమత్తం చేస్తామని, వారు తగిన రక్షణ కల్పిస్తారని ధైర్యం చెప్పారు.