తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాల సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు సభకు దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేశాక అసెంబ్లీ నుంచి గాయబ్ అయిపోతున్నారని సభలో పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి స్పీకర్ చేసిన ఈ వ్యాఖ్యలను వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ తన ఎక్స్ ఖాతాలో ఖండిస్తూ పోస్టు చేశారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ `ఎక్స్` వేదికగా.. బహుజన శాసన సభ్యులను దొంగలని సంభోదించడం స్పీకర్ గారి విజ్ఞతకు వదిలేస్తున్నా..., ప్రజాస్వామ్యంలో దొంగలంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కినోళ్లు, వేలంపాటలో సభ్యులను సరసమైనా ధరతో కొన్నోళ్లు, వైశ్రాయ్ హోటల్లో క్యాంపులు నడిపినోళ్లు, స్పీకర్ ను అడ్డుపెట్టుకొని పార్టీ పక్షనేతను పోటు పొడిచినోళ్లు, జయప్రదంగా పార్టీని, పార్టీ నిధిని దోచినోళ్లని స్పీకర్ గారు తెలుసుకోగలరని ఆశిస్తున్నా. మేమేమీ గోడలు దూకి, అర్ధరాత్రులు, అపరాత్రుల్లో సంతకం పెట్టలేదు…మా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నల రూపంగా సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకే సంతకాలు పెట్టాం కానీ దొంగలుగా కాదు...అంటూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.