విశాఖ: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద విశాఖలో పారిశ్రామికవేత్తల సహకారంతో పేదలకు అండగా ఉందామని, పార్టీలకు అతీతంగా పేదల ఆకలి తీరుద్దామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి అధికారులు బాగా పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా కరోనా నివారణ చర్యల్లో నిమగ్నమైందని, సీఎం వైయస్ జగన్ పిలుపుతో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. పేదలెవరికీ ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని విధాల సహాయ చర్యలను చేపట్టిందన్నారు. కరోనా మూడోవ స్టేజీకి వస్తున్న తరుణంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. ఇంటింటి ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లకు సూచించారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కొంచెం కరోనా కేసులు తక్కువేనన్నారు. రైతులు, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం హాట్స్పాట్ కాని ప్రాంతాల్లో పాక్షికంగా లాక్డౌన్ సడలించాలని కేంద్రాన్ని కోరినట్లు వివరించారు.