విశాఖపట్నం: విహారం కోసం కాశ్మీర్ లోని పహల్గాం వెళ్లిన విశాఖవాసి చంద్రమౌళి.. ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో మృతి చెందడంతో శుక్రవారం వైయస్ఆర్సీపీ నేతలు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ తదితరులు నివాళులర్పించారు. విశాఖలోని చంద్రమౌళి ఇంటికి వెళ్లిన వైయస్ఆర్సీపీ నేతలు..ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. స్నేహశీలిగా, సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా, ఆధ్యాత్మిక భావాలు గల విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి జె.ఎస్.చంద్రమౌళి మరణం ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తీరని వేదనను మిగిల్చిందని బొత్స సత్యనారాయణ అన్నారు. ఉగ్రదాడిలో ఆయన మరణవార్త విని వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారని, ఉద్యోగ విరమణ అనంతరం కూడా చంద్రమౌళి ఎంతో ఉత్సాహంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పార్టీ నాయకులు ఓదార్చి ధైర్యం చెప్పారు.